ఆనందం, జ్ఞానం, ఐశ్వర్యం, బలం- ఈ నాలుగు తత్వాల ఈశ్వరత్వమే గణపతి స్వరూపం. ఆ స్వామి ఆరాధన వల్ల ఆ నాలుగూ లభిస్తాయని పురాణాలు, ఆగమాలు వివరిస్తున్నాయి. పృథ్వీవాసులందరికీ భూ తత్వమే ప్రధానం. యోగ, ఉపాసన తత్వాల పరంగా భూ రూపమైన పరమేశ్వర తత్వమే గణేశుడు. మిగిలిన నాలుగింటినీ కలబోసుకున్న అవనీ తత్వమూర్తిగా దైవాన్ని భావించడమే మట్టి గణపతి రూపంలోని ప్రత్యేకత. నాలుగు దిక్కుల వ్యాపకత్వమే ‘చతుర్భుజం విష్ణుం’. ఏ వర్ణమూ లేని ఆకాశ తత్వమే ‘శుక్లాంబరం ధరం’. శుద్ధ జ్ఞానమే ‘శశి వర్ణం’. ఆనందానుగ్రహ భావమే ‘ప్రసన్న వదనం’. ప్రకృతి పురుషుల ఏకతత్వమే పార్వతీ శంకరుల తనయుడిగా వ్యక్తమైంది. వేద, పురాణ, ఆగమ, కావ్య, సంగీత, నాట్య, శిల్ప, చిత్రకళ రూపాల్లో గణేశుడికి అత్యంత ప్రాధాన్యం ఉంది. తెలివితేటలకు, నాయకత్వ లక్షణాలకు గణేశుడు అధి దైవం. ఉపాసన శాస్త్రాల్లో బాల గణపతి నుంచి మహా గణపతి వరకు అనేక రూపాల్ని వర్ణించారు. దేవ, దానవ, మానవ, పశు, పక్షి, వృక్ష- ఇత్యాది భిన్నజీవుల గణాల్ని పరిపాలించే ఏక ఈశ్వర తత్వమే ‘గణపతి’ అని రుషుల తాత్పర్యం. గణపతి తత్వాన్ని ఆధారం చేసుకొని, అత్యంత విస్తారమైన సంప్రదాయం ఉంది. శైవ వైష్ణవ శాక్తేయాల్లాగే ‘గాణపత్య...